తెలంగాణలో తినేందుకు ఆలుగడ్డను అధికమొత్తంలో వినియోగిస్తారని.. ఇక్కడ ప్రజల అవసరాలకు సరిపోయేలా ఉండాలంటే 2.5లక్షల ఎకరాల్లో పండించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వానాకాలం పంటలసాగుపై సంగారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కేవలం ఐదారు వేల ఎకరాల్లోనే ఆలుగడ్డలను పండిస్తున్నారని.. అందుకే యూపీ, గుజరాత్, పంజాబ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. 65 నుంచి 70 రోజుల్లోనే ఆలు గడ్డల పంట చేతికొస్తుందన్నారు. కొహెడలో నిర్మించే అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్లో 10 ఎకరాలు కోల్డ్ స్టోరేజీలకే కేటాయిస్తున్నట్లు నిరంజన్రెడ్డి వివరించారు. దీని ద్వారా ఆలుగడ్డ పండించే రైతులకు మంచి ప్రోత్సాహం లభిస్తుందన్నారు.
స్థానికంగా డిమాండ్ ఉన్న పంటలను పండిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. వ్యవసాయ, ఉద్యానశాఖలు ఎప్పుటికప్పుడు రైతుల్లో అవగాహన కల్పించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.