పల్లెలు సంపూర్ణ ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని TRS వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం గ్రామంలో 1కోటి 29లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, సామూహిక మరుగుదొడ్లు, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, అంతర్గత సిసి రోడ్లను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలోని అన్ని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తోందని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతీ గ్రామంలో అంతర్గత సీసీరోడ్లు, శ్మశాన వాటికలు, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీంతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయని అన్నారు.
దేశంలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆరెఎస్ ప్రభుత్వమని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ తోపాటు సాగు నీరు, రైతు బందు, రైతు భీమా వంటి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గ్రామాల అభివృద్ధితోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.ఈ కార్యక్రమంలో మండల, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.