దేశంలో రాష్ట్రపతి ఎన్నిక సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులగా ఎవరుంటారు? ఉత్తరాది వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటారా? దక్షిణాదికి ఈసారి అవకాశం దక్కుతుందా? ఏ వర్గానికి చెందిన వ్యక్తి దేశ ప్రథమ పౌరుడు అవుతారు అనే అంశాలపై జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై పేర్లు దక్షిణాది నుంచి ప్రచారం ఉండగా.. ఉత్తరాది నుంచి ద్రౌపది ముర్ము, శరద్పవార్, గులాంనబీ ఆజాద్ ఇలా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఓ సెంటిమెంట్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడికి ఈసారి రాష్ట్రపతి పదవి దక్కే అవకాశం ఉందని.. దానికి ఓ సెంటిమెంట్ బలం చేకూరుస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు 13 మంది ఉపరాష్ట్రపతులుగా పనిచేస్తే వారిలో తొలి ముగ్గురు రాష్ట్రపతి అవ్వగా.. ఆ తర్వాతి ముగ్గురు అవ్వలేదు. ఆ తర్వాత వరుసగా ముగ్గురు కాగా.. మళ్లీ ముగ్గురు కాలేదు. ఈ సెంటిమెంట్ ప్రకారం చూస్తే ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యకు అవకాశం దక్కేఅవకాశం ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమవుతుందో లేదో? చూడాలి.