ఇటీవలే వివాహం చేసుకున్న ప్రముఖ సినీనటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాదంలో చిక్కుకున్నారు. భక్తుల నుంచి విమర్శలు రావడంతో సారీ చెప్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే.. పెళ్లి అయిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నయన్, శివన్ల కొత్త జంట శుక్రవారం వచ్చింది. దర్శనం తర్వాత తిరుమల మాడ వీధుల్లో వారు చెప్పులు వేసుకుని తిరగడం.. ఆలయం వద్ద ఫొటోషూట్ చేసుకోవడంపై వివాదం చెలరేగింది. దీనిపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తితిదే అధికారులు సైతం ఈ విషయాన్ని నయన్, విఘ్నేష్ శివన్ దృష్టికి తీసుకెళ్లి వివరణ కోరారు. దీంతో విఘ్నేష్ శివన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆలయ ఆవరణలో ఫొటో షూట్ చేసుకోవాలనుకున్నామని.. భక్తులు ఎక్కువగా ఉండటంతో త్వరగా పూర్తిచేయాలనే ఉద్దేశంతో గందరగోళ పరిస్థితుల్లో తమ కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయామని ఆయన పేర్కొన్నారు. దేవుడిపై తమకు అపారమైన నమ్మకముందని.. అవమానించేందుకు అలా చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో తమను క్షమించాలని ఆ ప్రకటనలో విఘ్నేష్ శివన్ కోరారు.