ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్ అన్ని వర్గాలను అణగదొక్కుతున్నదని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. రాకేశ్ను కేంద్ర ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రైతులు, యువకులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన రాకేశ్ మృతదేహానికి ఎంజీఎం దవాఖానలో నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం మొండి వైఖరిని అందరూ ఖండించాలన్నారు. సైన్యంలో కూడా ఔట్సోర్సింగ్ విధానం తీసుకురావడం దారుణమన్నారు.
ప్రధాని మోదీ దేశప్రజలకు క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. రాకేశ్ మరణం ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. తెలంగాణ బిడ్లను సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నదని వెల్లడించారు.