విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా జలవిహార్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మోదీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని పేర్కొన్నారు. మోదీ..ప్రధానిగా కాకుండా దేశానికి సేల్స్మెన్గా పనిచేస్తున్నారని మండిపడ్డారు.మోదీ తీరుతో శ్రీలంకలో ప్రజలు నిరసనలు తెలిపారని గుర్తుచేశారు. శ్రీలంక చేసిన ఆరోపణలపై ప్రధాని మౌనమెందుకు వహిస్తున్నారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. శ్రీలంక విషయంలో స్పందించకుంటే ప్రధాని మోదీని దోషిగానే చూడాల్సి వస్తుందన్నారు.
మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని, సామాన్యుడు బతుకలేని పరిస్థితి నెలకొందని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. వికాసం పేరుతో దేశాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రధాని మోదీ అవినీతిరహిత భారత్ అని పెద్దపెద్ద మాటలు చెప్పారని, ఎంత నల్లధనం వెనక్కి తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీపాలనలో అవినీతిపరులు పెరిగిపోయారన్నారు. నల్లధనం నియంత్రణ కాదు.. రెట్టింపైంది.. ఇదేనా వికాసం? అని ప్రశ్నించారు. మోదీ ప్రధానిగాకాదు..దోస్త్ కోసం షావుకార్గా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థలను ప్రధాని మోదీ దుర్వినియోగం చేశారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.దేశంలో రైతులు, సైనికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. మోదీ పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దిగజారుతోందన్నారు. దేశంలో సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నా..విదేశాలనుంచి బొగ్గు కొనాలని రాష్ట్రాలకు కేంద్రం హుకుం జారీచేస్తున్నదని ముఖ్యమంత్రి మండిపడ్డారు. మోదీపై జనంలో ఆగ్రహం పెరుగుతోందని తెలిపారు. మోదీ ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు చెబుతారని ఎద్దేవా చేశారు.
రైతు చట్టాలు సరైనవే అయితే వాటిని వెనక్కు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. మీరు దేశం ముందు తలదించుకున్నారని ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్ సమావేశంలో మీ ప్రసంగమే కాదు.. మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. మోదీని చూసి పెద్దపెద్ద పరిశ్రమలు పారిపోతున్నాయని విమర్శించారు. ఎనిమిదేళ్లలో దేశంలో భారీ స్కాంలు జరిగాయన్నారు. రూపాయి పతనం చూస్తే మోదీ పాలన ఏంటో అర్థమవుతోందన్నారు. మోదీ షావుకార్ల సేల్స్మేన్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేక్ ఇన్ ఇండియా అనేది శుద్ధ అబద్దమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మోదీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. మోదీ విధానాలతోనే తమకు అభ్యంతరమని పేర్కొన్నారు. తాము మౌనంగా ఉండబోమని, పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.