తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగుల, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఉపకార వేతనాల విడుదలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సమీక్ష జరిపారు. ఆరు శాఖలకు సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఇవ్వాల్సిన 362.88 కోట్ల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించడం జరిగింది.
దీంతో పాటు మార్చి 31 వ తేదీలోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, విగలాంగుల, ఈబీసీ, మైనార్టీ శాఖల నుండి బిల్లులు అందలేదన్న కారణంతో ట్రెజరీ అధికారులు తిప్పిపంపడం జరిగిందని మంత్రి హరీశ్ రావు దృష్టికి రావడంతో దీనిపైన సమీక్షించడం జరిగింది. ఇందుకు సంబంధించిన బిల్లులను సంబంధింత శాఖలు తిరిగి ట్రెజరీకి సమర్పించాలని, ఆ బిల్లులను వెంటనే ట్రెజరీ అధికారులు క్లియర్ చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.
దీంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాల బీఆర్వోలను విడుదల చేయాలన్నారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎస్సీ డెవల్మెంట్ కమిషనర్ యోగితా రాణా, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు.