తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వానాకాలం రైతు బంధు నిధుల విడుదలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు ఇవాళ హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు 4 ఏకరాల వరకు ఉన్న 51.99 లక్షల మంది రైతులకు సంబంధించి 3946 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
78 లక్షల 93 వేల 413 ఎకరాలకు సంబంధించిన నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఐదు ఎకరాల పైబడి ఉన్నరైతులకు నేటి నుండి రైతు బంధు నిధులు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ అయ్యేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని మంత్రి హరీశ్ రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది.
అర్హులైన ప్రతీ రైతుకు సకాలంలో నిధులు అందేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు.ఈ సమీక్షలో రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్ చీ ఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.