తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ.. ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఉండబోదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వందేండ్లలో ఎన్నడూ పడనంత వర్షపాతం నమోదు అయినప్పటికి కనురెప్ప పాటు అంతరాయం లేకుండా సరఫరా అందించిన ఘనత తెలంగాణా విద్యుత్ సంస్థలకే దక్కిందని ఆయన కొనియాడారు. ఇవే వర్షాలు గతంలో పడ్డప్పుడు విద్యుత్ శాఖా అతలాకుతలం అయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో విద్యుత్ శాఖ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బుధవారం విద్యుత్ సౌధలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డితో పాటు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, జేఎండీ శ్రీనివాసరావు తదితర డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సరిహద్దుల్లో సైనికుల్లా క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బందితో సీఎండీలు సమన్వయం చేసుకోవడం వల్లనే ఇంతటి ప్రకృతి వైపరీత్యాలలోను విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగలేదన్నారు. అది ముమ్మాటికీ సీఎండీల ఘనతగానే ఆయన అభివర్ణించారు. ముందెన్నడూ లేని రీతిలో వర్షాలు, వరదలు సంభవించినప్పటికీ ట్రాన్స్ మిషన్ ,డిస్ట్రిబ్యూషన్ సమర్థవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణా విద్యుత్ సంస్థల కృషి అభినందనీయమన్నారు.
సింగరేణి ఓపెన్ కాస్ట్లో నీరు చేరడం, ట్రాన్స్ పోర్ట్ తదితర సమస్యలతో ఉత్పత్తి తగ్గినప్పటికీ జెన్కోకు సరఫరా చేస్తున్న బొగ్గు విషయంలో సమస్యలు ఉత్పన్నం కావడం లేదన్నారు. విద్యుత్ సరఫరా అన్నది డైనమిక్ సిస్టం అని, ఆటుపోట్లను అధిగమిస్తూ గ్రిడ్స్ దెబ్బతినకుండా పనిచేయడం తెలంగాణా విద్యుత్ సంస్థల పనితీరుకు నిదర్శనమన్నారు. తాజాగా కురుస్తున్న వర్షాలతో 2,300 స్తంభాలు నేలకొరిగాయని, వాటిలో ఇప్పటికే 1800 పై చిలుకు పునరుద్ధరించమన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఇప్పటికి బారీ వర్షాలు నమోదు అవుతున్నాయని, భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని ఒక్క సర్వాయిపేట సబ్ స్టేషన్ 33/11 కేవీకి సరఫరా ఆగిందన్నారు. రెండు మూడు రోజుల్లో దానిని పురుద్ధరించి సరఫరాను కొనసాగిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.