తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో సంభవిస్తున్న వరదలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద బాధితులకు అండగా నిలవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇలాంటి కష్ట సమయంలో తమతమ నియోజకవర్గాల్లోనే ఉండి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పార్టీ నాయకులకి కేటీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వీరి ప్రయత్నాల వలన ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందుతున్నాయని, ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల కార్యక్రమాలతో సమన్వయం చేసుకునేందుకు వీలు కలుగుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.