వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సెటైరికల్ ట్వీట్ చేశారు. భద్రాచలంలో గోదావరి వరదను పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బాధితులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ‘క్లౌడ్ బరస్ట్’పై ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. దీనిలో విదేశీయుల కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని.. ఈ మధ్య గోదావరి పరీవాహక ప్రాంతంలోనూ అలా చేస్తున్నట్లు చూచాయగా సమాచారం ఉందని కేసీఆర్ అన్నారు.
ఈ నేపథ్యంలో షర్మిల స్పందించారు. ‘‘ఆంధ్రోళ్ల అణిచివేతలైపోయినయ్.. ప్రతిపక్షాల పన్నాగాలు అయిపోయినయ్.. తిరుగుబాటుదారుల వెన్నుపోటులు అయిపోయినయ్.. జాతీయ పార్టీల జిమ్మిక్కులు అయిపోయినయ్.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అయిపోయింది.. ఇక అంతర్జాతీయ కుట్రలు మొదలైనయ్. ఒక్క వరదకే మన సీఎం కేసీఆర్ గారికి ఎన్ని కష్టాలొచ్చినయ్’’ అని ట్వీట్ చేశారు.