జంటనగరాల్లో బోనాలు వేడుకలు సజావుగా జరిపేల ఏర్పాట్లు జరుపుతున్నామని, అధికారులు, నిర్వాహకులు సమన్వయంగా వ్యవహరించాలని డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో వివిధ దేవాలయాల నిర్వాహకులకు చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమం గురువారం సితాఫలమండీ క్యాంపు కార్యాలయంలో జరిగింది. దాదాపు 185 దేవాలయాలకు రూ. కోటి మేరకు నిధుల చెక్కులను శ్రీ పద్మారావు గౌడ్ అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ జూలై 24, 25 తేదిల్లో చారిత్రాత్మక కట్ట మైసమ్మ దేవాలయంతో పాటు సికింద్ద్రాబాద్ అసెంబ్లి నియోజకవర్గం వివిధ దేవాలయాల్లో బోనాలు వేడుకలు జరుగుతాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సారిగా 2015 సంవత్సరంలో ప్రత్యేకంగా ఆలయాలకు నిధులు మంజూరు చేసే పద్దతిని ప్రవేశపెట్టాం. ప్రతి ఏటా ప్రభుత్వం నిధులను సమకుర్చుతోందని తెలిపారు. బోనాలు వేడుకలకు అన్ని ఏర్పాట్లు పకడ బందీగా చేపట్టాలని అయన అధికారులను ఆదేశించారు. పార్టీలు, రాజకీయాలతో నిమిత్తం లేకుండా అందరూ సహకరించాలి. పండుగ రోజుల్లో పరిశుభ్రత, రోడ్ల మరమ్మతులు, స్ట్రీట్ లైట్, మంచి నీటి సరఫరా వంటి ఏర్పాట్లలో లోపాలు వుండకుండా జాగ్రతలు పాటించాలి.
కరెంట్ సరఫరాలో ఇబ్బంది లేకుండా మొబైల్ జెనరేటలు సిద్దంగా వుంచుకోవాలి. వరుసగా రెండు రోజులు మంచి నీటిని సరఫరా చేయాలి. ఆలయాల వద్ద రద్దీ దృష్ట్యా పోలీసులు తగిన భద్రత యేర్పాట్లు చేయాలి. సిసి కెమెరాలు వినియోగించాలి. క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి. బోనాలతో వచ్చేవాళ్ళకి విడిగా క్యూ లైన్ ఏర్పాటు చేయాలి. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడకుండా జాగ్రతలు తీసుకోవాలని చిలక చిలకలగుడా పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ శ్రీ నరేష్ కు సూచించారు. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, సీతాఫల్ మండి లోని తన కార్యాలయం అందుబాటులో ఉంటుందని శ్రీ పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. దేవాదాయ శాఖ అసిస్టంట్ కమీషనర్ శ్రీ కృష్ణ, తెరాస యువ నేతలు శ్రీ కిశోర్ కుమార్, శ్రీ కిరణ్ కుమార్ గౌడ్, శ్రీ రామేశ్వర్ గౌడ్ లతో పాటు తెరాస నేతలు, వివిధ సంస్థల ప్రతినిధులు, ఆలయాల నిర్వాహకులు పాల్గొన్నారు.