ఇటీవల భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రంలో దోమలు పెరిగి డెంగీ జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వచ్చే నెల రోజులు చాలా కీలకమని, ముఖ్యంగా వరద ప్రభావిత, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లా వైద్యాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాధుల లక్షణాలున్నవారికి వెంటనే పరీక్ష నిర్వహించి, చికిత్స అందించాలని నిర్దేశించారు.
ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బు వృథా చేసుకోకుండా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్య సేవలను వినియోగించుకునేలా చూడాలన్నారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పారిశుద్ధ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. కాగా, పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు పంపిణీపై ప్రత్యేక దృష్టిసారించాలని మంత్రి సూచించారు. పది రోజుల్లో వ్యాక్సినేషన్ వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని డీహెచ్ గడల శ్రీనివాసరావును ఆదేశించారు.
జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో టీకా పంపిణీ చేపట్టాలన్నారు. 040-24651119 నంబరులో సంప్రదిస్తే 100 కంటే ఎక్కువ మంది ఉన్న చోట వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఈ విషయంపై ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు. వైద్యం, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల్లో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హరీశ్ తెలిపారు. ఎస్సీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లు మంత్రి హరీశ్ను కలిసి సమస్యలు వివరించారు. వారి అభిప్రాయాలు తీసుకుని నివేదిక రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ను హరీశ్ ఆదేశించారు