వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ సమావేశమయ్యారు. ఇచ్చిన పదవికి న్యాయం చేయాలని.. చేసే పని కష్టమనిపిస్తే చెప్పాలని కోరారు. అలా ఎవరైనా చెబితే వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తానన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నాణ్యతతో చేయాలని ఆదేశించారు.
అక్టోబరు 2 లోపు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం పూర్తిచేయాలని జగన్ స్పష్టం చేశారు. అన్ని కమిటీల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు.. మొత్తంపైన 50 శాతం మహిళలు ఉండేలా చూడాలని చెప్పారు. ఆగస్ట్ 4 నుంచి నియోజకవర్గానికి 50 మంది చొప్పున కార్యకర్తలతో సమావేశమవుతానని సీఎం ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రణాళిక త్వరలోనే ఖరారు చేస్తామన్నారు.