అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రమాదకారిగా మారిందని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అన్నారు. పొరపాటున ఆ పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాషాయ పార్టీ తెలంగాణపై కక్ష్య పెంచుకున్నదని, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నదని ఆగహ్రం వ్యక్తంచేశారు. మునుగోడు ఉపఎన్నిక ప్రజలు కోరుకుంటే రాలేదని, రాజగోపాల్ రెడ్డి అహంకారం వల్ల వచ్చిందని చెప్పారు.
రాజగోపాల్ బీజేపీ చేతిలో పావుగా మారాడన్నారు. మునుగోడు ప్రజలు బీజేపీకి బుద్ధిచెబుతారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీకి అధికార యావ తప్ప ప్రజలపై ప్రేమ లేదని దుయ్యబట్టారు