రానున్న రోజుల్లో సిద్దిపేటలో అన్ని క్రీడలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక & వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. త్వరలోనే 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ను అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి హరీష్ తెలిపారు.
జిల్లా కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2కే రన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు చాలా ముఖ్యమని, మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు ఆటలు ఆడాలన్నారు.ఇప్పుడిప్పుడే సమాజం యోగ, క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తుండటం శుభపరిణామమని మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేటలో క్రికెట్ స్టేడియం, ఫుట్ బాల్, వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
ఈ మేరకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దిన కోచ్లు, క్రీడాకారులను మంత్రి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, జిల్లా స్పోర్ట్స్ క్లబ్ కన్వీనర్ పాల సాయిరాం, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత, తదితరులు పాల్గొన్నారు.