భర్త అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నాడని పెళ్లి అయిన కొన్ని రోజులకే అతడ్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది భార్య. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో కక్ష పెంచుకున్న భర్త తమకు పెళ్లి చేసిన వ్యక్తిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కొడవలి తీసుకొని అతని ఇంటికి వెళ్లాడు. సమయానికి ఆయన లేకపోవడంతో నిండు గర్భిణి అయిన ఆ వ్యక్తి భార్యను చంపేశాడు. కిరాతకమైన ఈ ఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలి పరిధిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన వెంకటరామకృష్ణ, స్రవంతి దంపతులు. కొంతకాలంగా వీరు హైదరాబాద్ వచ్చి సాప్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వారికి చైత్ర అనే పదేళ్ల కూతురు ఉంది. ప్రస్తుతం స్రవంతి 8 నెలల ప్రెగ్నెంట్. ఈ దంపతులు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలేనికి చెందిన కావూరి శ్రీరామకృష్ణ అనే వ్యక్తికి స్రవంతి పిన్ని కూతురు లక్ష్మిప్రసన్నకు పెళ్లి జరిపించారు.
కొంతకాలం తర్వాత లక్ష్మిప్రసన్నను అదనపుకట్నం కోసం భర్త వేధిస్తుడడంతో ఆమె కుటుంబసభ్యులకు చెప్పి హైదరాబాద్లోని పుట్టింటికి వచ్చేసింది. అక్కడే ఓ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తుంది. అంతేకాకుండా సిటీలో చందానగర్ పోలీస్ స్టేషన్లో భర్తపై కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు భర్త శ్రీరామకృష్ణకు నోటీసులు జారీ చేశారు. అయితే భార్య తనపై కేసు పెట్టడానికి విడిచి పెట్టి వెళ్లడం వెనుక వెంకటరామకృష్ణ, స్రవంతి దంపతులే ఉన్నారని భావించి బావను చంపాలని నిర్ణయించుకున్నాడు శ్రీరామకృష్ణ. వెంటనే ఎర్రగడ్డలో వేటకొడవలి కొని.. ఈనెల 6న కొండాపూర్లో బావమరిది ఇంటికి వెళ్లాడు. బావమరిది కూతుర్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్లగా ఇంట్లో స్రవంతి ఒక్కరే ఉన్నారు. శ్రీరామకృష్ణ చేతిలో కొడవలి చూసిన ఆమె వెంటనే కేకలు పెట్టారు. దీంతో ఆయన ప్రెగ్నెంట్ అని చూడకుండా ఆమెను కొడవలితో నరికి పారిపోయాడు. బాధితురాలి కేకలు విని పక్కింటివారు వచ్చి ఆమెను ఓ ప్రైవేటు హాస్పిటల్కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి, అతడిని అరెస్టు చేశారు.