మూర్ఛతో కూతురు చనిపోయిందని భావించిన ఆ తల్లిదండ్రులకు రెండున్నరేళ్ల మనవరాలు చెప్పిన మాటలు విని కుప్పకూలిపోయారు. తాత.. అమ్మ గొంతును నాన్న ఇలా నొక్కాడు.. అని రెండు చేతులను తన మెడ దగ్గర పెట్టి చెప్పింది ఆ చిన్నారి. అమ్మ ఎలా చనిపోయింది.. నాన్న ఏం చేశాడో ఆ చిన్నారి వచ్చిరాని మాటలు, సైగలతో వివరించడంతో తాత గుండె ఆగినంతపనైంది.
ఒడిశాలోని ఉమ్మర్కోట్ సమితి సిలాటిగావ్ గ్రామానికి చెందిన మాణిక్ ఘోష్, కారాగావ్ గ్రామానికి చెందిన లిపికా మండల్కు ఏడేళ్ల క్రితం పెళ్లయింది. ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉండాలని భావించి కాకినాడ వెళ్లి సెటిలయ్యారు. రెండున్నరేళ్ల క్రితం ఈ జంటకు మహి పుట్టింది. అప్పటివరకు అనందంగా సాగిపోతున్న ఆ కాపురంలో బిడ్డ రంగు కోసం తరచూ గొడవలు జరిగేవి. పాప నల్లగా ఉందని.. తన బిడ్డ కాదేమోనని ఆ భర్త అనుమానం పెంచుకొని తరచూ భార్యను వేధించేవాడు. దీంతో లిపికా పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తమామలు కలుగజేసుకొని తిరిగి భర్త దగ్గరకు పంపారు. అయితే ఈనెల 18న లిపికాకు మూర్ఛ రాగా భర్త హాస్పిటల్కు తీసుకెళ్లాడు. అప్పటికే లిపికా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మెడపై కమిలినట్లు గుర్తులు కనిపించడంతో సిబ్బంది కాకినాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా మనవరాలు మాటల ద్వారా విషయం అర్థం చేసుకున్న తాత పోలీస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాణిక్ను విచారించగా భార్యను చంపేసినట్లు విచారణలో తేలింది.