గతంలో దాదాపు యాబై ఏండ్ల పాటు అనేక పదవులను అనుభవించిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్ము కశ్మీర్లో డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో నిన్న సోమవారంఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన నూతన పార్టీని ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తాను ప్రకటించిన సరికొత్త పార్టీ స్వతంత్ర ఆలోచనలు, సిద్ధాంతాలతో ప్రజాస్వామిక పునాదులపై వేళ్లూనుకుంటుందని తెలిపారు.
అయితే తాను ప్రకటించనున్న కొత్త పార్టీకి పేరు పెట్టమని రాష్ట్ర ప్రజలకు సూచిస్తే వారు 1500 పేర్లను పలువురు సూచించారు.. ప్రజాస్వామిక, శాంతియుత, స్వతంత్రతలను ప్రతిబింబించే పేరు పెట్టాలని తాము కసరత్తు సాగించామని ఆజాద్ వెల్లడించారు. పార్టీ పేరును వెల్లడించే ముందు ఆదివారం ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.
తమ పార్టీ మతం, కులం ఆధారంగా రాజకీయాలు చేయదని చెప్పుకొచ్చారు. ఇక పార్టీ పేరుతో పాటు జెండాను కూడా ఆజాద్ వెల్లడించారు. పార్టీ జెండాగా మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.మూడు రంగులు నిలువుగా ఉన్న ఆ జెండాలో నీలం, తెలుపు, పసుపు రంగులతో డిజైన్ చేశారు. పసుపు రంగు నూతనత్వానికి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, తెలుపు శాంతికి చిహ్నమని, నీలం స్వేచ్ఛకు.. సముద్రంలోని లోతుకు.. అనంతమైన ఆకాశ వర్ణానికి చిహ్నమని గులాం నబీ ఆజాద్ వివరించారు.