మేడ్చల్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ పట్టణం ప్రధాన రహదారిపై వివేకానందా విగ్రహం వద్ద స్కూటీపై ఓ మహిళ రోడ్డు దాటుతుండగా అటుగా వస్తున్న ఓ లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీ నుంచి మహిళ కిందపడిపోగా ఆమెపై నుంచి లారీ దూసుకుపోయింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతురాలు మేడ్చల్ నివాసి అయిన ప్రియా కంద్రాగా గుర్తించారు. ఆమె ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుందని విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఘటన జరిగిందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.