స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ రైతులు సొంతంగా నిలదొక్కుకోలేదు. వ్యవసాయ కార్పొరేటీకరణలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ అవలంబించిన విధానాలు రైతుల ఉనికిని ప్రశార్థకం చేస్తున్నాయి. మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు సాగుచట్టాలు ఎవుసంపై కేంద్రానికి ఏ మాత్రం ప్రేమ ఉన్నదో స్పష్టంచేస్తున్నది. ఏడాదిపాటు ఉద్యమించి ఆ చట్టాలను వెనక్కి తీసుకొనేలా చేయటంలో విజయం సాధించిన రైతుల్లో ఉద్యమ సెగ ఇంకా చల్లారలేదు. ఎవుసాన్ని కాపాడుతూ, రైతును నిలబెడుతున్న కేసీఆర్, భారత్ రాష్ట్ర సమితి వారికి ఆశాకిరణంలా కనిపిస్తున్నది. ఇప్పటి వరకు కులాలు, మతాలు, ప్రాంతాలు, ఉగ్రవాదంపై దేశ రాజకీయాలు నడిచాయి. ఇప్పుడు మాత్రం రైతు కేంద్రంగా రాజకీయం నడవబోతున్నది. భవిష్యత్తు రాజకీయాలకు రైతులే రథసారథులు.. వారి చోదక శక్తి బీఆర్ఎస్, కేసీఆర్!
నల్ల చట్టాలు తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి తగిన వేదిక కోసం రైతు నేతలు ఎదురుచూస్తుండగా, కేసీఆర్ నేతృత్వంలో భారత్ రాష్ట్ర సమితి వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టయింది. వ్యవసాయానికి సర్కారు మద్దతు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో, అచ్చంగా అలాగే తెలంగాణ మాడల్ అమలవుతుండటం..వారిని కేసీఆర్కు మరింత దగ్గరచేసింది. ఈ నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితికి అండగా ఉండాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. సంఘటిత పోరాటానికి బీఆర్ఎస్ సరైన వేదికగా భావిస్తూ 26 రాష్ర్టాల రైతు సంఘాల నాయకులు గత నెలలో హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్తో విస్తృతంగా చర్చించారు. స్వయంగా రైతు అయిన కేసీఆర్ మాత్రమే తమను సరైన మార్గంలో నడిపించగలరన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.
గుజరాత్లో ఆందోళనలు
——————————–
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోనూ వ్యవసాయానికి కోతలు లేని విద్యుత్తు కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని పుణెకి చెందిన ఓ రైతు ప్రధాని మోదీ జన్మదినం రోజునే సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేంద్రం విధానాలతో గిట్టుబాటు ధర లభించక చనిపోతున్నట్టు పేర్కొన్న విషయం తెలిసిందే. బీజేపీ పాలిత కర్ణాటకలోనూ ‘పే ఫార్మర్’ నినాదంతో రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. కర్ణాటకలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలను అమలుచేస్తామని జేడీఎస్ పార్టీ అగ్రనేత, మాజీ సీఎం కుమారస్వామి ప్రకటించటం రైతులెంతో కీలకమో తెలియజేస్తున్నది. మధ్యప్రదేశ్లో కూడా రైతులు ఉచిత విద్యుత్తు, గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్నారు.
బీజేపీ వ్యతిరేకులకూ బీఆర్ఎస్సే వేదిక
—————————————
రైతులతోపాటు బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకించే శక్తులన్నీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నాయి. సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన బీజేపీ ముక్త్ భారత్ నినాదాన్ని ప్రగతిశీల శక్తులు స్వాగతిస్తున్నాయి. కాంగ్రెస్ నానాటికీ చతికిలబడటంతో బీజేపీని ఎదుర్కొగలిగే శక్తి బీఆర్ఎస్కే ఉంటుందని విశ్వసిస్తున్నాయి. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవటం తప్ప, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించటం లేదని అనేకవర్గాల్లో నాటుకుపోయింది. వామపక్షాలు సైతం బీజేపీని ఎదుర్కొగలిగే జాతీయపార్టీ బీఆర్ఎస్సేనని భావిస్తున్నాయి. వీరంతా బీఆర్ఎస్ ఎజెండా కోసం ఆసక్తిగా వేచిచూస్తున్నారు.
మరోవైపు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ద్వయం పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి అధికారమే పరమావధిగా చేస్తున్న అరాచకాలను ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుబ్రమణ్యస్వామి పలు సందార్భల్లో బాహాటంగానే వ్యతిరేకించారు. కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ సైతం కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. సాగుచట్టాలను ఆ పార్టీకి చెందిన సత్యపాల్ మాలిక్ మేఘాలయ గవర్నర్ పదవిలో ఉండీ వ్యతిరేకించారు. ఈ ఉదంతాలన్నీ బీజేపీలోని లుకలుకలను బయటపెడ్తున్నాయి.
మూడో జాతీయ పార్టీకి చోటు
—————————————
ఎప్పుడో 137 ఏండ్ల కిందట(1885) పుట్టిన కాంగ్రెస్, 42 ఏండ్ల కిందట పుట్టిన బీజేపీ తప్ప దేశంలో మూడో జాతీయ పార్టీగా ఏదీ ఉనికి చాటుకోలేదు. ఈసీ నిబంధనల మేరకు రెండు, మూడు రాష్ర్టాల్లో పోటీచేసి సాంకేతికంగా కొన్ని జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందటమే తప్ప.. దేశవ్యాప్తంగా విస్తరించిన పార్టీలు లేవు. జాతీయపార్టీగా గుర్తింపు పొందిన టీఎంసీ, అన్నాడీఎంకే, మజ్లిస్, ఫార్వార్డ్ బ్లాక్ ఒకట్రెండు రాష్ర్టాలకే పరిమితమయ్యాయి. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన ఏకైక పార్టీ ఆమ్ఆద్మీయే. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా అన్నిరాష్ర్టాల్లో కొంత ఓటు బ్యాంక్ కలిగి ఉన్నాయే తప్ప, ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగే బలం లేదు.
దక్షిణాదిలో బీజేపీ కర్ణాటకలో మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కేంద్రంలో కాంగ్రెస్ సొంతంగా 1984లో మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగింది. బీజేపీ 2014, 2019లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. బీజేపీ, కాంగ్రేసేతర పార్టీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటికీ కూటమిగా ఏర్పడటంతోనే సాధ్యమైంది. ప్రతిపక్ష హోదా నిలుపుకోలేనంతగా కాంగ్రెస్ బలహీన పడటం, బీజేపీకి అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మూడో జాతీయ పార్టీ నిలదొక్కుకోవడానికి అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఏర్పాటుచేసిన భారత్ రాష్ట్ర సమితి ఆ ఖాళీని భర్తీ చేస్తుందని విశ్లేషిస్తున్నారు.
ఎరువులు, విత్తనాల కోసం తెలంగాణకే
———————————–
ఛత్తీస్గఢ్ మారాయిగూడెంలో పదెకరాల్లో సాగుచేస్తున్నా. ఎరువులు, విత్తనాలు తెలంగాణలోనే కొంటాం. రైతులకు మా ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేదు. కానీ తెలంగాణ రైతులకు కేసీఆర్ అన్నీ ఇస్తున్నారు. కేసీఆర్ ప్రధాని అయితే మాకూ రైతుపథకాలు వస్తాయి.
– వీరభద్రం, మారాయిగూడెం, ఛత్తీస్గఢ్
రైతు పథకాలు ఆదర్శం
———————————
మాకు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో కూడా సాగు భూమి ఉంది. మా రాష్ట్రంలో పంటలమ్మినా రైతుబంధు కింద ఇచ్చినంత డబ్బు రాదు. తెలంగాణలోని రైతు సంక్షేమ పథకాలు కర్ణాటకలో అమలుచేయాలని కోరినా మా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శం. బీఆర్ఎస్ అధికారంలో వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది.
– బాబూరావు, మాజీ జడ్పీ సభ్యుడు, మాల్కాపూర్, బీదర్ జిల్లా, కర్ణాటక
పేదలకు మేలు చేస్తున్న దేవుడు కేసీఆర్
—————————————
తెలంగాణ సీఎం కేసీఆర్ పేదల కోసం మంచి పథకాలు అమలు చేస్తున్నారు. కర్ణాటకలో అలాంటి పథకాల్లేవు. సమీపంలో ఉన్న తెలంగాణ గ్రామాలకు వెళ్లినప్పుడు మాకు ఇలాంటి పథకాలు ఉంటే బాగుండేదని ఆలోచించే వాళ్లం. బీఆర్ఎస్ను కర్ణాటక ప్రజలు స్వాగతిస్తున్నారు. పేదలకు మేలు చేస్తున్న దేవుడు సీఎం కేసీఆర్.
– సంగప్ప, పంచాయతీ మాజీ సభ్యుడు, సుల్తాన్పూర్, బీదర్ జిల్లా, కర్ణాటక
కేసీఆర్ ప్రధానైతే రైతుకు న్యాయం
———————————————
తెలంగాణలో మత్స్యకారుల కోసం అక్కడి ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తున్నది. ఉచితంగా చేప పిల్లలు ఇస్తున్నది. మార్కెట్ వసతి, ఇన్సూరెన్స్ కల్పిస్తున్నది. వాహనాలను కూడా ఇచ్చింది. ఇలాంటి పథకాలు మహారాష్ట్రలో ఒక్కటీ లేవు. సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని అయితేనే అందరికీ న్యాయం జరుగుతుంది.
-లస్మ పొచ్చు, మత్య్సకారుడు, బోరి, మహారాష్ట్ర
బీఆర్ఎస్ చారిత్రక అవసరం
————————————-
బీఆర్ఎస్ ఇప్పుడు దేశ ప్రజలకు ఎంతో అవసరం. 75 ఏళ్ల స్వత్రంత్ర భారతంలో కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని అప్పులపాలు చేశాయి. తెలంగాణలో 8 ఏండ్లలోనే అభివృద్ధి కండ్లకు కడుతున్నది. నిబద్ధత, కార్యదీక్షత కలిగిన గొప్పనాయకుడు కేసీఆర్తో దేశంలో పురోగమించటం ఖాయం. అమెరికా, బ్రిటన్, చైనా, జపాన్ కంటే గొప్పగా భారతదేశాన్ని తీర్చిదిద్దే నాయకుడు కేసీఆరే. 2024లో బీఆర్ఎస్ దేశంలో ప్రధానపార్టీగా నిలుస్తుంది.
– వ్యాళ్ల హరీశ్రెడ్డి ఎన్నారై టెక్సాస్ స్టేట్ టీఆర్ఎస్ నాయకుడు (పాలకుర్తి)
ఇక దేశానికి మంచిరోజులు
———————————–
రాష్ట్రంలోని అట్టడుగువర్గాల ప్రజల సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన నేత కేసీఆర్. దేశానికి అలాంటి నాయకుడు అవసరం. కేసీఆర్ సారథ్యంలో ఈ దేశానికి మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాం. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లడాన్ని స్వాగతిస్తున్నాం.
– సీహెచ్ శ్రీనివాస్,తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
కేసీఆర్తో విద్య నవీకరణ
———————————-
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేశాయి. తెలంగాణలో విద్యావ్యవస్థ రూపురేఖలే మార్చేసిన దార్శనికుడు కేసీఆర్. కేసీఆర్ రాకతో విద్యావ్యవస్థ నవీకరణ జరుగుతుంది. అందుకే.. యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్స్(ఉథాట్స్) బీఆర్ఎస్కు ఘన స్వాగతం పలుకుతున్నది.
-బైరి నిరంజన్, ఉథాట్స్ ప్రధాన కార్యదర్శి
కేసీఆర్ వెన్నంటే యువత
————————————-
దేశంలో ఈ నాటికి పేదరికం ఉన్నది. 75 ఏండ్ల స్వతంత్ర భారతాన్ని ఏలిన జాతీయ పార్టీల పరిపాలన వైఫల్యాలకు నిదర్శనం ఇది. వాటికి ఎన్నికలే లక్ష్యం తప్ప ప్రజల జీవితాల సముద్ధరణపై చిత్తశుద్ధితో కృషి చేస్తున్న దాఖలాల్లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ విధానాలకు పూర్తి విరుద్ధం. గొప్ప విజనరీ. ఆయన సారథ్యం దేశానికి ఇప్పుడు అవసరం. దేశం తలరాతను మార్చాలనే సంకల్పంతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న కేసీఆర్ వెన్నంటే యువత ఉంటుంది.
-కే వాసుదేవరెడ్డి, చైర్మన్, వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ
బీఆర్ఎస్తో విప్లవాత్మక మార్పులు
—————————————-
బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకొంటాయి. మోదీ సర్కార్ విధానాలతో దేశంలోని అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని దేశంలో దీటుగా ఎదుర్కొనే శక్తి సీఎం కేసీఆర్కే ఉన్నది. దేశ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే కేసీఆర్ ప్రధాని కావాలి. దేశమంతా సీఎం కేసీఆర్ నాయకత్వంవైపు ఎదురు చూస్తున్నది. రాబోయే రోజుల్లో దేశమంతటా బీఆర్ఎస్ విస్తరిస్తుంది.
-సుర్వి యాదయ్యగౌడ్, సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుడు