ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరూ స్లిమ్గా కనబడాలని ఉబలాటపడుతున్నారు. దీనికి ఆడ, మగ అనే తేడా లేకుండా పోయింది. స్లిమ్గా కనిపించేందుకు, శరీరం బరువును తగ్గించుకునేందుకు పొద్దున్నే రన్నింగ్ చేయడం, జిమ్లలో చెమట తీయడం వంటి కఠిన పనులను ఎంచుకుంటున్నారు. తిండిలో సైతం మార్పులు చేసుకుంటున్నారు. అయితే, కొన్నిరకాల పానీయాలను ఉదయాన పరిగడుపున తీసుకోవడం వల్ల శరీరం బరువును తగ్గించుకోవచ్చు. అవేంటంటే..
శరీరం బరువు తగ్గించడంలో ఆహారం, రోజువారీ శారీరక శ్రమ.. రెండూ కీలక పాత్ర పోషిస్తాయి. శరీరం బరువు తగ్గడానికి జీవనశైలిలో చిన్నపాటి నియంత్రణలు చేసుకోవడం చాలా అవసరం. ఇందులో ఖాళీ కడుపుతో పానీయాలు కూడా ఉన్నాయి. నిర్విషీకరణకు సహాయపడే పానీయాలు బరువు తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అవి జీర్ణక్రియ ప్రక్రియను ప్రోత్సహించడంతోపాటు శరీరం నుంచి విషాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. నిమ్మరసం వంటి పానీయాలు ఖాళీ కడుపుతో పరిగడుపునే తీసుకుంటే మనల్ని హైడ్రేట్గా ఉంచడమే కాకుండా శరీరం బరువు తగ్గడంలో సహాయపడతాయి.
యాపిల్ సైడర్ వెనిగర్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, వెనిగర్ తీసుకోవడం వల్ల ఊబకాయం ఉన్నవారిలో శరీర బరువు, శరీర కొవ్వు ద్రవ్యరాశి, సీరం ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయిలు తగ్గుతాయి. ఎఫెక్టివ్గా బరువు తగ్గడానికి యాపిల్ సైడర్ వెనిగర్ను ఖాళీ కడుపుతో తినాలని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గే విషయంలో యాపిల్ సైడర్ వెనిగర్ పరిమాణం చాలా ముఖ్యం. 200 మి.లీ నీటిలో 5-10 ఎంఎల్ యాపిల్ సైడర్ వెనిగర్ను జోడించి తీసుకోవాల్సి ఉంటుంది. బొడ్డు చుట్టూ కొవ్వును తగ్గించడానికి పరిగడుపునే తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
మెంతుల నీరు
మెంతులు లేదా మెంతి గింజలు నానబెట్టిన నీరు శరీరం బరువు తగ్గడానికి గణనీయంగా దోహదపడుతుంది. మెంతి గింజల్లో సపోనిన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉండి ఆరోగ్య ప్రయోజనాలకు కారణమవుతాయి. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని త్రాగాలి. రుచిని మెరుగుపరచడానికి అర టీస్పూన్ తేనెను కలుపుకోవడం ఉత్తమం.
జీరా నీరు
వంటకాల్లో వాడే జీరా చాలా ప్రయోజనకరమైనది. జీవక్రియను పెంచడంలో బాగా పనిచేస్తుంది. అలాగే, శరీరం బరువు తగ్గడానికి సహాయపడే ఎంజైమ్లను స్రవిస్తుంది. మరోవైపు, సోంఫ్ విత్తనాలు కూడా ఆహారం నుంచి పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి. తద్వారా ఆకలి కోరికలు తగ్గి బరువు తగ్గుతారు. జీరా, సోంఫ్ రెండింటినీ రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.
త్రిఫల నీరు
త్రిఫల అనేది హరితకీ, బిభిటాకీ, ఉసిరితో తయారు చేయబడిన గొప్ప మూలికా ఔషధం. ఇది పలు వ్యాధుల నుంచి రక్షించడానికి, అలాగే, మలబద్ధకంను తగ్గించడలో కీలకపాత్ర పోషిస్తుంది. త్రిఫల యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును బర్న్ చేయడంలో సాయపడతాయి. కొవ్వు కణాల ద్వారా ఉత్పత్తైన విషపదార్థాలను బయటకు పంపడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. రాత్రి పూట రెండు టీస్పూన్ల త్రిఫల పొడిని ఒక గ్లాసు నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో త్రాగాలి.
కూరగాయల జ్యూస్
బచ్చలికూర, దోసకాయ, కాలే, ఆకుకూరలతో సహా పచ్చని ఆకు కూరలను కలిపి ఇంట్లోనే గ్రీన్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. దీని రుచి కోసం కొంచెం ఉప్పు, మిరియాలు, నిమ్మరసం కలుపుకోవాలి. గ్రీన్ జ్యూస్లోని సూక్ష్మ, స్థూల పోషకాలు శరీరంలోని అవయవాలు మెరుగ్గా పనిచేయడంలో సహాయపడతాయి. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థలో పోషకాలు సులభంగా శోషించేలా చేస్తుంది. కూరగాయలతో గ్రీన్ జ్యూస్ తయారవుతున్నందున ఎక్కువ పోషకాలు, తక్కువ కేలరీలు అంది శరీరం బరువు తగ్గిపోతుంది.
దాల్చిన చెక్క నీరు
దాల్చిన చెక్క విసెరల్ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ పరాసిటిక్ లక్షణాలను కలిగి ఉండి సమర్థవంతంగా బరువు తగ్గడంలో సాయపడుతుంది. గ్లాసు దాల్చిన చెక్క నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలుపుకొని తీసుకోవచ్చు. నిద్ర పోవడానికి ముందు, నిద్ర మేల్కొన్న గంట వ్యవధిలోతీసుకోవడం ద్వారా తేనె ఎక్కువ క్యాలరీలను కరిగించి వేస్తుంది. అంతేకాకుండా, తేనెలో ఉండే ముఖ్యమైన హార్మోన్లు శరీరం బరువు తగ్గించే ఆకలిని అణిచివేసేందుకు దోహదం చేస్తాయి.
Source : Namasthe Telangana