పాకిస్థాన్లోని కరాచీకి సమీపంలోని ఎం-9 మోటార్ వే వద్ద బుధవారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నడిరోడ్డుపై బస్సులో తీవ్రంగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోవడంతో 21 మంది సజీవదహనమయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. బస్సులో ప్రయాణికులంతా ఇటీవల పాకిస్థాన్లో ముంచెత్తిన వరదల్లో చిక్కుకున్న బాధితులు.
పాకిస్థాన్లో ఇటీవల వరదలు ముంచెత్తడంతో విపత్తు సమయంలో ఆ వరద బాధితులను మోటార్ వే సమీపంలో ఆశ్రయం కల్పించారు. ఇన్ని రోజులు అక్కడ తలదాచుకున్న బాధితులు తిరిగి సొంత జిల్లా దాదాకు ఓ ప్రైవేటు ఏసీ బస్సులో బయలు దేరారు. ఇంతలో బస్సు వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయి. దీంతో 21 మంది సజీవదహనం అయ్యారు. ప్రమాదం సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు. మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు బస్సు నుంచి దూకేశారు. ఇందులో 10 తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు.