తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ మూడో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి సీపీఎం, సీపీఐ పార్టీలు మద్ధతు తెలిపాయి.
ఈ క్రమంలో ఈ రోజు గురువారం మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా చండూరు మండలంలోని బంగారిగడ్డ నుంచి చండూరు పట్టణం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల పెద్ద ఎత్తున పాల్గొన నున్నారు. మునుగోడుకు ఉప ఎన్నిక ఎందు కు వచ్చింది? ఎవరి కోసం వచ్చిందో..? ర్యాలీలో నేతలు వివరించనున్నారు. బీఆర్ఎస్తోపాటు సీపీఎం, సీపీఐ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలిరానున్నాయి.