తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని ఉప్పల్లో ఘోరం చోటుచేసుకుంది. ఈరోజు (శుక్రవారం) ఉదయం 5 గంటల సమయంలో తండ్రీకొడుకులు దారుణహత్యకు గురయ్యారు. ఉప్పల్లోని గాంధీబొమ్మ బ్యాక్సైడ్ హనుమసాయి కాలనీలో ఈ జంట హత్యలు జరిగాయి.
హనుమసాయి కాలనీలో నివాసం ఉంటున్న తండ్రి నరసింహమూర్తి (78), కొడుకు శ్రీనివాస్ (35)లను దుండగులు గొడ్దలితో అత్యంత పాశవికంగా చంపేశారు. ముందుగా తండ్రి మీద దాడి చేసిన దుండగులు అడ్డు వచ్చిన కొడుకుని కూడా హతమార్చారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పనిమనిషిని కూడా కత్తితో బెదిరించారు.
తెల్లవారు జామున 5.30 సమయంలో బ్లూ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి గాంధీ బొమ్మ నుంచి మెయిన్ రోడ్డు వైపు పారిపోయాడని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే బృందాలుగా విడిపోయి సమీపంలోని కాలనీలు, ప్రదేశాలు గాలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆస్తి కోసం బంధువులే హత్య చేయించి ఉంటారని అనుమానిస్తున్నారు.