తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ మహానగరానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పచ్చదనం పెంపుపై వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతోపాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్ అవార్డునూ దక్కించుకొన్నది.
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి వరల్డ్ సిటీ గ్రీన్ అవార్డును ప్రదానం చేశారు. నగరానికి విశ్వఖ్యాతి రావడానికి సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంతోపాటు పచ్చదనం పెంపునకు తీసుకొన్న చర్యలే ప్రధాన కారణం.
భారత్ నుంచి ఈ పురసారం అందుకొన్న ఒకే ఒక సిటీ మన హైదరాబాద్ కావడం విశేషం. మరో విభాగమైన లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్లో మరో అవార్డును అందుకొన్నది. నగర వాసులందరూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి, అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వ్యవస్థలు, పరిష్కారాలను రూపొందించడంపై ఈ క్యాటగిరీ దృష్టి సారిస్తుంది. తెలంగాణ రాష్ర్టానికి గ్రీన్ నెక్లెస్గా పిలిచే ఓఆర్ఆర్ చుట్టూ పచ్చదనం పెంపుతో నగరం ఈ విభాగంలో ఉత్తమమైనదిగా ఎంపికైంది.
‘వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డ్స్-2022’ కోసం ఆరు క్యాటగీరీల్లో
ఎంట్రీలను అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ ఆహ్వానించింది. నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెలంగాణ ప్రభుత్వ నిరంతర కృషికి నిదర్శనమని, ఇందుకు కృషిచేసిన ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్తో పాటు హెచ్ఎండీఏ బృందానికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.