కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతార’. సప్తమి గౌడ నాయికగా నటించింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం.. అక్టోబర్ 15న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. ఇప్పుడీ సినిమా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది.
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది. నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి ఫుల్ మార్కులు సొంతం చేసుకున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.‘‘కుటుంబ సభ్యులతో కలిసి కాంతార సినిమా చూశా. ఇప్పటికీ నా శరీరం వణుకుతూనే ఉంది. ఇదొక అద్భుతమైన అనుభవం. సాంప్రదాయం, జానపద కథలు, దేశీయ సమస్యల సమ్మేళనమే ఈ చిత్రం. రిషబ్ శెట్టికి హ్యాట్సఫ్. రచన, దర్శకత్వం, నటన.. అన్నీ మరో స్థాయిలో ఉన్నాయి.
ప్రకృతి అందాలను చూపించిన విధానం, యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది. సినిమా అంటే ఇది. ఇప్పటి వరకు ఇలాంటి సినిమాను చూడలేదంటూ కొందరు ప్రేక్షకులు సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తూ అనుకుంటుండటం నేను విన్నాను. ఇలాంటి సినిమా తీసినందుకు ధన్యవాదాలు. మరో వారం పాటు ఈ అనుభూతి నుంచి నేను బయటకు రాలేననే అనుకుంటున్నా’’ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.