ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో శనివారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని కూతురు రైలు పట్టాల వెంట పరుగెడుతుండగా ఎదురుగా ట్రైన్ రావడాన్ని గమనించిన తండ్రి ఆమెను రక్షించబోయి ప్రాణాలు కోల్పోయారు.
గజపతినగరం మండలం మధుపాడలోని బంధువుల ఇంటికి వచ్చిన లింగాలవలసకు చెందిన బెల్లాన తవుడు (36), ఆయన కుమార్తె శ్రావణి(12) మృతిచెందారు. తవుడు, కుమార్తె శ్రావణిని తీసుకుని ద్విచక్ర వాహనంపై స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లారు. మతిస్థిమితం లేని ఆ చిన్నారి రైలు పట్టాల వెంబడి పరుగుతీసింది. రైలు రాకను గమనించిన తండ్రి ఆమెను రక్షించడానికి వెళ్లగా విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న రైలు ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతుడి భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తవుడుకు ఇద్దరు కుమార్తెలు. చిన్నమ్మాయి విజయలక్ష్మి నాలుగో తరగతి చదువుతోంది. భార్య భారతితో పాటు వృద్ధులైన తల్లి రాములమ్మ, తండ్రి అప్పలనాయుడులకు ప్రస్తుతం ఆసరా లేకుండా పోయింది.