చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై టీమ్ ఇండియా అదరగొట్టింది. టీ20 వరల్డ్కప్ తొలి మ్యాచ్లో దాయాది జట్టును ఓడించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్.. క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలు మజాను అందించింది. ఓ దశలో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన టీమ్ ఇండియాను విరాట్ కోహ్లీ (82 నాటౌట్) విజయతీరాలకు చేర్చాడు. చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి ఉండగా అశ్విన్ దాన్ని పూర్తిచేయడంతో భారత్ గెలుపొందింది.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ జట్టులో షాన్మసూద్, ఇఫ్తికార్ అహ్మాద్ హాఫ్ సెంచరీలు చేశారు.
160 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన టీమ్ ఇండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కేవలం 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య ఆదుకున్నారు. ఐదో వికెట్కు వంద రన్స్ చేసి జట్టును మెరుగైన స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత పాండ్య అవుటైనా.. చివర్లో వచ్చిన అశ్విన్ సాయంతో కోహ్లీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది.