మహారాష్ట్రలో ఇటీవల శివసేనను చీల్చి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను స్వీకరించి పట్టుమని పది నెలలు కాకుండానే ప్రస్తుత ముఖ్యంత్రి అయిన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ శివసేనలో అసంతృప్తి జ్వాలలు నెలకొన్నాయా?.. షిండే వర్గానికి చెందిన 40 ఎమ్మెల్యేల్లో 22 మంది మరో పార్టీలోకి జంప్ కానున్నారా? ..అంటే అవుననే అంటున్నది మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం ఆధ్వర్యంలోని శివసేన మౌత్పీస్ సామ్నా పత్రిక.
తాత్కాలిక ఒప్పందంలో భాగంగానే ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి పీఠం కూర్చోబెట్టారని, తొందర్లోనే ఆయన యూనిఫాం వదిలేయాల్సి ఉంటుందని తన ఎడిటోరియల్లో రాసుకొచ్చింది.ఏ క్షణంలోనైనా ఆయన ముఖ్యమంత్రి యూనిఫాం తొలగించే అవకాశం ఉందని అందరికి అర్ధమైంది. అంధేరి ఈస్ట్ ఉపఎన్నికల్లో షిండే వర్గం తన అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉన్నది.
అయితే బీజేపీ దానిని అడ్డుకున్నదని వెల్లడించింది. ఇక ఈ మధ్యే జరిగిన గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల్లో విజయంపై వారు చెప్పేదంతా అబద్ధమని, వాస్తవానికి షిండే వర్గంలోని సుమారు 22 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపింది. వారిలో అత్యధికులు ఏక్షణమైనా బీజేపీలో చేరే అవకాశం ఉందని పేర్కొన్నది. బీజేపీ తన స్వార్థం కోసం షిండేని వాడుకుంటున్నదని విమర్శించింది. వాస్తవానికి ప్రభుత్వం తరఫున అన్ని నిర్ణయాలు మాజీ సీఎం, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ తీసుకుంటున్నారని, వాటిని షిండే ప్రకటిస్తాడని చెప్పింది.