కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి జార్ఖండ్లోని హేమంత్ సొరేన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. గత ఆగస్టులోనే ‘మనీ గేమ్’ ఆడినట్టు తాజాగా తేలింది. దీని కోసం అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆశజూపి, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేలా కమల నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, బెంగాల్ పోలీసుల మెరుపు దాడితో ఈ కుట్ర భగ్నమైంది. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రతినిధి సాకేత్ గోఖలే శుక్రవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి 2019 డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. హేమంత్ సొరేన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)కు ఎన్నికల్లో 30 సీట్లు దక్కగా, బీజేపీకి 25, కాంగ్రెస్కు 16 సీట్లు లభించాయి. ఆర్జేడీ, సీపీఐఎంఎల్, ఎన్సీపీకి తలా ఒక్క సీటు లభించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన కనీస మెజారిటీ 41 సీట్లు. దీంతో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎంఎల్, ఎన్సీపీ కలిసి మహాఘట్బంధన్గా ఏర్పడి సొరేన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకొన్న బీజేపీ.. మహారాష్ట్రలో ఉద్ధవ్ సర్కారును కూల్చగానే జార్ఖండ్ను తదుపరి లక్ష్యంగా చేసుకొన్నది. ఒకవైపు, కేంద్ర దర్యాప్తు సంస్థలతో సొరేన్ను ప్రత్యక్షంగా టార్గెట్ చేసిన బీజేపీ.. మరోవైపు, సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బుల ఎర వేయడం ప్రారంభించింది. ఈ ఏడాది జూలైలో ఈ కుట్రకు తెరతీసింది.