టీడీపీ ప్రభుత్వం చేయలేని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ అని ఆయన కొనియాడారు. నిడమానూరులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వంశీ మీడియాతో మాట్లాడారు.
పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వంశీ చెప్పారు. సంక్షేమ పథకాలతో పాటు సమాంతరం అభివృద్ధి కూడా జరుగుతోందన్నారు. గ్రామాల్లో 90 శాతం ప్రజలకు జగన్ అందిస్తున్న సంక్షేమం అందుతోందని చెప్పారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వంశీ మండిపడ్డారు. ఆయనకు తెలియని విద్యలేదని ఎద్దేవా చేశారు. వైసీపీకి భవిష్యత్ లేదని చెప్పేందుకు చంద్రబాబు జ్యోతిష్యం నేర్చుకున్నాడా? అని వ్యాఖ్యానించారు. సెల్ఫోన్, కంప్యూటర్, టీవీ, హైదరాబాద్ కనిపెట్టిన చంద్రబాబే జ్యోతిష్యం కూడా కనిపెట్టి ఉంటాడని వంశీ ఎద్దేవా చేశారు.