ఏపీ ప్రజలు అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని.. ప్రపంచవ్యాప్తంగా వారికి గుర్తింపు ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.10వేల కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టులకు ఆయన వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. ‘ప్రియమైన సోదరీసోదరులారా.. నమస్కారం’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు.
‘‘విశాఖపట్నానికి ఇవాళ మరపురాని రోజు. దేశంలోనే ఇది విశిష్టమైన నగరం. వ్యాపార కేంద్రంగా విశాఖపట్నం విరాజిల్లుతోంది. వెయ్యేళ్ల క్రితమే రోమ్కు ఈ నగరం నుంచి వ్యాపారం జరిగేది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మిజోరం గవర్నర్ హరిబాబు నన్ను కలిసినప్పుడల్లా ఏపీ అభివృద్ధి గురించే మాట్లాడేవారు. సమ్మిళితమైన అభివృద్ధే మా ఆలోచన. సామాన్యుడి జీవితాన్ని మెరుగుపరచడమే మా లక్ష్యం.
ఎప్పుడైతే పేదవాళ్ల శక్తి పెరిగి ఆధునిక సాంకేతికత వారికి అందుబాటులోకి వస్తుందో అప్పడే వికసించిన భారత్ కల సాకారమవుతుంది. వికసించిన భారత్ అనే అభివృద్ధి మంత్రంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. రైల్వే, రోడ్లు, పోర్టుల అభివృద్ధి విషయంలో ముందుంటున్నాం. విశాఖ రైల్వే స్టేషన్తో పాటు పోర్టును ఆధునికీకరిస్తున్నాం. బహుముఖ రవాణా వ్యవస్థ దిశగా విశాఖ ముందడుగు వేస్తోంది. మిషన్ గతిశక్తి కింద ప్రాజెక్టుల్లో వేగం పెంచాం. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి’’ అని మోడీ అన్నారు.