తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేసిన బీజేపీకి బుద్ధిచెప్తామని, ఎవరినీ వదలబోమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హెచ్చరించారు. తమను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారమే తాము ప్రగతిభవన్లో ఉంటున్నామని చెప్పారు. తమనెవరూ నిర్బంధించలేదని, కావాలనే కొందరు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కాలమే వారికి సమాధానం చెప్తుందని అన్నారు.
మంగళవారం తెలంగాణభవన్ ప్రాంగణంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని బతికించే వారధులుగా తాము ఉన్నామని, సీఎం కేసీఆర్కు అందుబాటులో ఉండేందుకే ప్రగతిభవన్లో తాము ఉంటున్నామని చెప్పారు.కుట్రదారుల ఎత్తులను చిత్తు చేస్తామని తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలం ప్రజలకు అందుబాటులోనే ఉన్నామని, ప్రజాసమస్యలపై స్పందిస్తూ వాటిని పరిషరిస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్న బీజేపీని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతామని పేర్కొన్నారు. తామంతా సీఎం కేసీఆర్ వదిలిన బాణంలా పనిచేస్తామని తెలిపారు. భవిష్యత్లో తెలంగాణ భారత్ను కాపాడిందనే ఖ్యాతిని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తామెంత వరకైనా పోరాడతామని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తామని చెప్పారు. తమకు బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు .