AP Government : ఆంధ్రప్రదేశ్ రైతులకు వైకాపా ప్రభుత్వం తాజాగా మరో శుభవార్తను ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా పంట లను నష్టపోయిన వారికి పరిహారం అందించేందుకు సిద్దమైంది. కాగా ఇక్కడ విశేషం ఏంటంటే… సీజన్ ముగియక ముందే ప్రభుత్వం పరిహారం అందించడం. నవంబర్ 28వ తేదీన పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,998 మంది రైతులకు చెందిన 60,832 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది.
ఈ మేరకు 14 జిల్లాల పరిధి లోని 24,199 మంది రైతులకు చెందిన 26,540 ఎకరాల్లో ఉద్వాన పంటలు దెబ్బతిన్నాయి. అలానే 20 జిల్లాల పరిధిలో 21,799 మంది అన్నదాతల 34,292 ఎకరాల్లో వ్యవసాయ పంటలు పాడయ్యాయని గుర్తించారు. ఎక్కువగా కోనసీమ జిల్లాలో 12,886 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. పంట నష్ట పరిహారానికి అర్హులైన రైతుల జాబితాలను ఇప్పటికే ఆర్బీకేలలో ప్రదర్శిస్తున్నారు.
ప్రస్తుతం 2022–23లో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 45,998 మంది అన్నదాతలకు ఈ నెల 28న రూ.39.39 కోట్లు ఇవ్వనున్నారు. అదే విధంగా నవంబర్ 28న రైతులకు మరో బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారు సీఎం జగన్. బకాయి ఉన్న సున్నా వడ్డీ నగదు సైతం సీఎం జగన్ జమ చేయనున్నారు. 2020–21 రబీ సీజన్కు సంబంధించి 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, 2021 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 5.68 లక్షల మందికి రూ.115.33 కోట్లు సున్నా వడ్డీ అకౌంట్లో వేయనున్నారు. ఈ నగదును నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు.