తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆవిష్కరణల దిక్సూచిగా నిలిచింది అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇల్లందులోని సింగరేణి పాఠశాలలో జరిగిన సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి హాజరై మంత్రి మాట్లాడారు.
పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో సాంకేతిక స్ఫూర్తిని పెంపొందించాలని, తద్వారా వారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా అందిపుచ్చుకోగలరని అన్నారు. రాష్ట్రంలో స్టార్టప్ల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రంగా హైదరాబాద్ లో టీ హబ్ను మంత్రి శ్రీ కేటీఆర్ సారథ్యంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ స్టార్టప్ పాలసీ దేశానికే రోల్మోడల్గా నిలుస్తుందని రాష్ట్ర స్టార్టప్ విధానం పురోగతి సాధిస్తూ కార్పొరేట్, అకడమిక్ రంగంలో అత్యుత్తమ ఫలితాలను సాధించి దేశానికే ఆదర్శంగా నిలవనున్నది అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.