AP High Court : అమరావతి రాజధాని అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట వచ్చింది. అమరావతిలో నిర్మాణాలు, స్థలాలపై డెడ్లైన్ పెట్టి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే జనవరి 31 కి వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి… అభ్యంతరాలు ఉంటే చెప్పాలని స్పష్టం చేసింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఈ ఏడాది మార్చి 3న హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు అప్పీల్కు వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. దానిపై ఇవాళ వాద, ప్రతివాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు ధర్మాసనం.
హైకోర్టు తమ పరిధి దాటిందని, ఎగ్జిక్యూటివ్ పవర్స్ని కూడా హైకోర్టే అమలు చేస్తోందని వ్యాఖ్యానించింది. ఒకే చోట నగరాభివృద్ధి కేంద్రీకరించడం కంటే వేర్వేరు పట్టణాలను అభివృద్ధి చేయడం బెటరని, అలాంటప్పుడు హైకోర్టు జోక్యం చేసుకోవడం సమంజసం కాదని అభిప్రాయ పడింది. గతంలో ఏడు అంశాల వారీగా తీర్పు చెప్పింది హైకోర్టు. అందులో 3 నుంచి 7 అంటే ఐదు అంశాలపై స్టే విధించింది సుప్రీం కోర్టు.
మూడో అంశంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. 4వ అంశంలో మాస్టర్ ప్లాన్ను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. 5వ అంశంలో అమరావతి కేపిటల్ సిటీ, కేపిటల్ రీజియన్ నిర్మాణాన్ని 6 నెలల్లో చేపట్టాలని ఆదేశించింది. 6వ అంశంలో అమరావతి కేపిటల్ సిటీని నివాసయోగ్యంగా మార్చాలని, ఏడో అంశంలో కేపిటల్ రీజియన్లో స్థలాల్ని రైతులకు 3 నెలల్లోగా కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ ఐదు అంశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.