తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో బద్ధిపోచమ్మ ఆలయాన్ని మహా పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. నారాయణరావు పేటలోని ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..బద్ధిపోచమ్మ ఆలయాన్ని దర్శించుకోవడానికి చాలా రోజుల నుంచి చూస్తున్నానని, ఆ ఆశ ఇప్పటికి తీరిందని అన్నారు. ఆలయం మళ్లీ ప్రారంభం కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
బద్ధిపోచమ్మ దయతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. బద్ది పోచమ్మ ఆలయ పరిసరాల్లో పలు కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి పండగ లోపు ఆలయ ప్రాంగణంలో వసతి కోసం భవన నిర్మాణ పనులు పూర్తి కావాలని తెలిపారు. రోడ్డు పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దశల వారీగా ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు.
సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు ఆయిల్ పామ్ పంటను పరిశీలించారు. ఈ పంటకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. తక్కువ కష్టం, తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని ఆయిల్ పామ్ పంట ద్వారా సాధించవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని రైతులు ఆయిల్ పామ్ పంట సాగును చేపట్టి మంచి ఆదాయాన్ని పొందాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట మండలం బంజరుపల్లికి చెందిన పిట్ల శంకర్ అనే రైతు పొలంలో ఆయిల్ పామ్ మొక్కలు మంత్రి ఈ సందర్భంగా నాటారు.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 6300 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటినట్లుగా మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. అలాగే మొత్తం 10 వేల ఎకరాల్లో ఈ పంట సాగు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా ఏడాదికి రూ.3 లక్షల 60 వేలు ఆదాయాన్ని రైతులు పొందవచ్చని తెలిపారు.