తెలంగాణలో ప్రజా సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్ ముందుకు వెళ్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎప్పటికప్పుడూ నూతన భవనాలను ఏర్పాటు చేస్తూ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నామని కేసీఆర్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అలాగే పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రస్తావనను తీసుకొచ్చారు.
భారత రాష్ట్ర సమితి పార్టీ దేశంలోని ప్రజలకు చేరువవ్వాలని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలు తనకు హామీ ఇస్తేనే తాను బీఆర్ఎస్ పార్టీ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని, తానెప్పుడూ ప్రజల సమస్య పరిష్కారానికే ఆలోచిస్తూ ఉంటానని తెలిపారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకున్నట్లు దేశాన్ని కూడా బంగారంగా మారుస్తానని కేసీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణలో బీజేపీ నేతలు కోతలు కోస్తున్నారని, ఆ పార్టీ నాయకులు రాష్ట్రానికి చేసిన మేలు ఏదీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందే తప్పా లాభం ఏ వైపునా రావడం లేదన్నారు. బీజేపీ సర్కార్ వల్ల రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల నష్టం జరిగిందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, పాలనా తీరును ప్రశ్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి చూస్తున్నారని, ఇది మోదీ అనుసరిస్తున్న నిరంకుశ విధానమని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యబద్దంగా కొన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఏర్పాటైతే వాటికి ఆటంకాలు కలిగించడానికి బీజేపీ నాయకులు కష్టపడుతున్నారన్నారు.
దేశంలో ఏం జరిగినా గ్రామీణ ప్రాంతాల్లో సైతం వాటి గురించి చర్చలు జరగాలని, దేశ రాజకీయాలపై ముఖ్యంగా బీజేపీ సర్కార్ తీరుపై యువత, మేధావులు నోరు విప్పాలని పిలుపునిచ్చారు. భారత దేశాన్ని బీఆర్ఎస్ పార్టీ తరపున బంగారంగా తీర్చిదిద్దే శక్తి తనకు ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.