Ys Jagan : నాకు వాళ్ల మాదిరిగా పత్రికలు, టీవీలు లేవు. ఆ దేవుడు దయ, మీ ఆశీస్సులు మాత్రమే ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. తొలుత పలువురు పెన్షన్ లబ్దిదారులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పెన్షన్ దారులనుద్దేశించి జగన్ ప్రసంగించారు. నేను ఒక ఎస్సీని, ఒక బీసీనీ, ఒక మైనార్టీని, పేద వర్గాలను మాత్రమే నమ్ముకున్నాను అని తెలిపారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ… ఇది కులాల మధ్య యుద్ధం కాదని, పేదవారికీ పెత్తందార్లకు మధ్య జరిగే జరిగే యుద్ధమని… పొరపాటున వైసీపీ ఓడిపోతే పేదవాడు నాశనమైపోతాడని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని… కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. రాజమండ్రి పుష్కరాల్లో ఫొటో షూట్ కోసం డ్రోన్ షాట్ల కోసం డైరెక్టరును దగ్గర పెట్టుకుని చంద్రబాబు గేట్లున్నీ మూసివే యడంతో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారని ఎద్దేవా చేశారు. కందుకూరులో మీటింగ్ కి జనం తక్కువ రాగా ఎక్కువగా వచ్చినట్టు చూపించడానికి సందులోకి జనాన్ని తీసుకెళ్లి వారిని చంద్రబాబు పొట్టనపెట్టుకున్నారని విమర్శించారు.
అదే విధంగా చంద్రబాబు సభకు జనం రావడం లేదనే కారణంతో చీరలు పంపిణీ చేస్తామని పిలిచి… వేలల్లో టోకెన్లు ఇచ్చి అర కొరా పంపిణీ చేసి గుంటూరులో మరో ముగ్గురిని బలి తీసుకున్నారని విమర్శించారు. అలాగే గుంటూరు ఘటనలో పోలీసులను తప్పుబట్టడాన్ని జగన్ తప్పుబట్టారు. చంద్రబాబు హయాంలో మంచి స్కీమ్లు ఏమీ లేవని, ఉన్న ఏకైక స్కీం దోచుకో, పంచుకో, తినుకో… అనేది అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జగన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.