తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కేంద్రంలోని మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు దిగొచ్చింది. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్న దేశంలో ఫెడరల్ స్పూర్తి పరిఢవిల్లాలని సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కీలక ఫలితం దకింది. సీఎం కేసీఆర్ డిమాండ్ మేరకు ఇకనుంచి పోటీ పరీక్షలను అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు.
రైల్వే, డిఫెన్స్, బ్యాంకింగ్ తదితర కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే నిర్వహించడం సరికాదని, ప్రాంతీయ భాషల్లోనూ వీటిని నిర్వహించి, దేశవ్యాప్తంగా నిరుద్యోగులు నష్టపోకుండా చూడాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా స్పందించింది.
సీఎం కేసీఆర్ డిమాండ్ మేరకు హిందీ ఇంగ్లిష్తోపాటు రాజ్యాంగం 8వ షెడ్యూల్లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయించింది. దీంతో ఆయా రాష్ర్టాల్లో గ్రూప్ 1, 2, 3 ఎస్సై, కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రయోజనం చేకూరనున్నది.