తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఖమ్మంలో జరిగిన తొలి బహిరంగ సభతో దుమ్ములేపిన బీఆర్ఎస్ .. దూకుడు మరింత పెంచుతున్నది. జాతీయస్థాయిలో ప్రభావం చూపేలా రెండో సభకు సిద్ధమవుతున్నది. ఫిబ్రవరి 17న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది.
ఈ సారి కూడా ఉత్తర, దక్షిణ భారతాల సమ్మేళనంగా సభావేదిక కనిపించనున్నది. ఖమ్మం సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు హాజరవగా.. ఈ సారి సభకు తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు ఎంకే స్టాలిన్, హేమంత్ సొరేన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ రానున్నారు. 17న ఉదయం నూతన సెక్రటేరియట్ ప్రారంభ కార్యక్రమంలో వారు అతిథులుగా పాల్గొననున్నారు.
భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్త ప్రచారాస్ర్తాన్ని వేగవంతం చేసింది. ఖమ్మంలో ఆవిర్భావ సభ విజయవంతం కావటంతో రెండో భారీ బహిరంగ సభ ఎంపికలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఈసారి వేదికగా హైదరాబాద్ను ఎంచుకొన్నారు. నూతన సచివాలయం ప్రారంభించే ఫిబ్రవరి 17నే పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. బీఆర్ఎస్గా ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటగా జరిగిన ఖమ్మం సభ దిగ్విజయంగా సాగింది. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇతర జాతీయ నేతలు తరలివచ్చారు.
ఆ సభలో బీజేపీ దుష్ట రాజకీయాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రజల్లోకి దూసుకెళ్లింది. మూడు, నాలుగు రాష్ర్టాలు.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ర్టాల నుంచి వచ్చిన అశేష జనం బీఆర్ఎస్ నినాదాలను మోసుకెళ్లారు. దీంతో బీఆర్ఎస్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రచారాన్ని ఉద్ధృతం చేసేలా, బీజేపీని ఎండగట్టేందుకు అస్త్రశస్ర్తాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే రెండో భారీ బహిరంగ సభకు ముహూర్తం పెట్టారు.