వరుస సిరీస్ విజయాలతో జోరుమీదున్న టీమ్ఇండియా మరో సిరీస్కు సిద్ధమైంది. వన్డే ఫార్మాట్లో న్యూజిలాండ్ను క్లీన్స్వీప్ చేసిన భారత్.. శుక్రవారం నుంచి మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. రాంచీ వేదికగా తొలి పోరు జరుగనుండగా.. వన్డేల్లో ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్ చూస్తున్నది. విరామం లేకుండా ఆడటం వల్ల ఆటగాళ్లు అలసిపోకుండా ఉండేందుకు ఈ సిరీస్ నుంచి సీనియర్లకు విశ్రాంతినిచ్చారు.
యువ భారత జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్నాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్’ టెస్టు సిరీస్ జరుగనున్న నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్కు ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చారు.
దీంతో పవర్ హిట్టర్ హార్దిక్ పాండ్యాతో పాటు యువ ఓపెనింగ్ జోడీ శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కీలకం కానున్నారు. రంజీ ట్రోఫీలో మెరుపులు మెరిపించి చాన్నాళ్ల తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన ముంబై ఓపెనర్ పృథ్వీ షాకు తుది జట్టులో చాన్స్ దక్కడం కష్టమే.
తుది జట్లు (అంచనా)
భారత్: పాండ్యా (కెప్టెన్), గిల్, ఇషాన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్, దీపక్ హుడా, సుందర్, శివమ్ మావి, ఉమ్రాన్, అర్ష్దీప్, కుల్దీప్/చాహల్.
న్యూజిలాండ్: శాంట్నర్ (కెప్టెన్), అలెన్, కాన్వే, చాప్మన్, ఫిలిప్స్, మిషెల్, బ్రాస్వెల్, టిక్నర్, సోధి, లిస్టెర్, ఫెర్గూసన్.
పిచ్, వాతావరణం
రాంచీ వికెట్ బ్యాటింగ్కు సహకరించనుంది. రాత్రి తేమ ప్రభావం ఉండనుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపనుంది. మ్యాచ్కు వర్ష సూచనలేదు.