GUTTA SUKENDAR: తెలంగాణలో మరోసారి భారాస అధికారంలోకి వస్తుందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా మన రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని వ్యాఖ్యానించారు. నల్లగొండలో క్యాంపు కార్యాలయంలో మీడియాతో గుత్తా సుఖేందర్ రెడ్డి ముచ్చటించారు.
అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సాగు రంగానికి జీవం పోస్తూ….ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి దేశ ప్రజలు గర్విస్తున్నారు. ఇలాంటి వ్యక్తి దేశాన్నే శాసిస్తే ఇంకెంత బాగుపడుతుందో అని దేశప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. అంతటి వ్యక్తి కేసీఆర్.
ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట తాము నడవాలని దేశ ప్రజలు ఆశపడుతున్నారని మండలి ఛైర్మన్ అన్నారు. రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్ చేసిన మాటలు…..సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా ఉందన్నారు. తెలంగాణ భవిష్యత్ కేసీఆర్ చేతిలోనే శశ్యశ్యామలంగా ఉంటుందని తెలిపారు.
ముందస్తు ఎన్నికలు రావు: గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని మండలి ఛైర్మన్ వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికల వలే వామపక్షాలతో పొత్తు ఉంటుందని అన్నారు. టికెట్ల కేటాయింపులో సర్వే ప్రకారమే కేసీఅర్ నిర్ణయం ఉంటుందని వ్యాఖ్యానించారు. కేంద్రం కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తోంది తప్ప ప్రజలకు కోసం పనిచేయట్లేదని విమర్శించారు. కేంద్రం చేస్తున్న పనులను దేశ ప్రజలు గమనిస్తున్నారని…..త్వరలో భారీ మూల్యం చెల్లించుకుంటారని దుయ్యబట్టారు. భాజపాకు ఎవరూ వ్యతిరేకంగా ఉన్నా వాళ్ల ఈడీ, ఐటీ నిఘానేత్రం ఉంటుందన్నారు. చివరకు బీబీసీ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థపైన ఐటీ దాడులు చేశారంటే భాజపా ఎంతటికైనా దిగజారుతుందని విమర్శించారు. ఇది దేశానికి, దేశ ప్రజలకు మంచిది కాదని అన్నారు. మీడియా సంస్థలపై కుట్రలు, కుతంత్రాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వెల్లడించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు భాజపాకే వర్తిస్తుందని అన్నారు.