SWACH SURVEKSHAN: స్వచ్ఛ భారత్ అవార్డులో తెలంగాణ సత్తాచాటిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రకటించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్రం ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ప్రకటిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డుల్లో రెండు వేర్వేరు విభాగాల్లో.. తొలి మూడుస్థానాలతో నంబర్ 1గా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. అక్టోబర్ –డిసెంబర్-2022 త్రైమాసికానికి స్వచ్ఛ భారత్ ఎంపిక చేసిన రెండు విభాగాల్లోనూ అవార్డులు వరించాయి.
స్టార్ త్రీ విభాగంలో సిద్ధిపేట, జగిత్యాల జిల్లాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయని వెల్లడించారు. కేరళలోని కొట్టాయం మూడో స్థానంలో నిలిచిందన్నారు. గతంలోనూ స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రకటించే ప్రతి అవార్డుల్లోనూ తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలుస్తూనే ఉందని మంత్రి గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రి వర్గం కృషి వల్లే రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయని మంత్రి కొనియాడారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డులు రావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అధికారుల కృషిని సైతం అభినందించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా….. అవార్డులు ఇస్తోందని మంత్రి అన్నారు. అందుకు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి వంటి వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. కేసీఆర్ నిధులు, విధులు ఇచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నారన్నారు. అలాగే ముఖరా కే గ్రామ సర్పంచ్ కు జాతీయ అవార్డు వచ్చినందుకు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనుండడం అభినందించాల్సిందే అని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.