ఆత్మీయ సమ్మేళనంలో పారాచ్యూట్ కథ జనం మనసును కదిలించింది. అధికారం కోసం ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల ఎట్ల ఆరాటపడుతున్నాయో కండ్లకుకట్టినట్టుగా ఆవిష్కరించింది. బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ తన ప్రసంగంతో మెప్పించారు. రాష్ట్రంలో అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ల నైజాన్ని ‘ఒక విమానం… నాలుగు పారాచ్యూట్’ కథతో ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.ఆ కథ కమామిషు ఏమిటంటే ఆయన మాటల్లో..
ఒక విమానంలో సీఎం కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్తోపాటు ఒక పాప కలిసి ఐదుగురు టూర్కు వెళ్తున్నారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తగా, అందులో ఉన్న ఐదుగురికి ఉన్నవి కేవలం నాలుగు పారాచ్యూట్లు మాత్రమే. చావు మీదకు వచ్చేసరికి మొదట పవన్ కల్యాణ్ ‘నేను ఏపీకి సీఎం కావల్సినోన్ని, నా ఆశ తీరకుండా నేను చావలేను. నేను బతకాలి’ అంటూ ఒక పారాచ్యూట్ తీసుకొని కిందకు దూకుతాడు.
ఆ తర్వాత రేవంత్ రెడ్డి ‘రాష్ర్టాన్ని 70 ఏండ్లుగా పాలించినం. ఇంకా పాలించాలి’ అంటూ రెండో పారాచ్యూట్ తీసుకొని దూకాడు. ఇక బండి సంజయ్ లేచి ‘ఇప్పటికే కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చినం. తెలంగాణలో కూడా రావాలి, మాకు కావల్సింది అధికారం అంతే.. అందుకే నేనూ బతకాలి’ అంటూ మూడో పారాచ్యూట్ తీసుకొని కిందకు దూకేస్తాడు.
ఇక మిగిలింది సీఎం కేసీఆర్, ఆ పాప మాత్రమే. ఒక్కటే పారాచ్యూట్ ఉంది. అప్పుడు కేసీఆర్ లేచి, ‘చూడు పాప. నేను తెలంగాణ కోసం చావు అంచు దాకా వెళ్లి రాష్ట్రం సాధించిన. ప్రజలు కోరుకున్న దానికంటే ఎక్కువగా అభివృద్ధి చేసిన. మా తెలంగాణ ప్రజల్లో పోరాడే సత్తువ నింపిన. ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు. నీకు ఎంతో బంగారు భవిష్యత్ ఉంది. కాబట్టి నీవు బతకాలి’ అంటూ ఉన్న ఒక్క పారాషూట్ పాపకు ఇచ్చి దూకమంటాడు.. అప్పుడు ఆ పాప ‘కేసీఆర్ తాత.. గ బండి సంజయ్ పారాచ్యూట్ అనుకొని ఏమి ఆలోచించకుండా నా స్కూల్ బ్యాగు తీసుకొని దూకిండు. ఇక్కడ ఇంకా రెండు పారాచ్యూట్లు మిగిలి ఉన్నాయి.. వీటితో మనమిద్దరం క్షేమంగా కిందకు వెళ్దాం..’ అంటూ ఆ ఒక్క కథలో బీజేపీ, కాంగ్రెస్ల ఆరాటం గురించి చక్కగా వివరించడంతో సభలో ఉన్న జనం, కార్యకర్తలంతా ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు.
‘గా పాపకు ఉన్న సోయి ఇక్కడి మా బీజేపీ, కాంగ్రెసోళ్లకు లేదు.. వాళ్లు ఎన్నిమాటలు చెప్పినా మా ఓటు బీఆర్ఎస్కే’ అంటూ చేతులెత్తి గట్టిగా నినదించారు. ఆ కథ జనాన్ని ఆలోచింపజేయడంతోపాటు సభలో కొద్దిసేపు నవ్వులు కూడా కురిపించాయి.