కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ గాయని రక్షిత సురేష్ మలేషియాలో కారు ప్రమాదానికి గురయ్యారు. మలేషియా నుండి స్వదేశానికి రాక కోసం ఎయిర్పోర్ట్కు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది.
ఎయిర్బ్యాగ్స్ తెరుచుకోవడంతో రక్షిత సురేష్కు తీవ్రగాయాలు కాలేదు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె స్పందిస్తూ…‘ఇవాళ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాను. మలేషియా ఎయిర్పోర్ట్కు తిరిగి వస్తుండగా నా కారు డివైడర్ను ఢీకొట్టింది.ఎయిర్బ్యాగ్స్ తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాను.
ప్రమాదం జరిగిన క్షణంలో జీవితమంతా నా కళ్లముందు కదలాడింది. ప్రమాదాన్ని తలుచుకుంటే వణుకు పుడుతున్నది. డ్రైవర్కు, నాతో పాటు ప్రయాణిస్తున్న మరో ప్యాసింజర్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి’ అని వెల్లడించింది.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన ‘అల్లిపూల వెన్నెల…’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా..’, నాగ చైతన్య ‘లవ్స్టోరి’ చిత్రంలో ‘ముత్యాల చెమ్మ చెక్క..’ వంటి పాటలు రక్షిత సురేష్కు తెలుగు శ్రోతల్లో గుర్తింపు తీసుకొచ్చాయి.