నాగర్ కర్నూల్ జిల్లా జిల్లా పరిధిలోని అచ్చంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. నియోజకవర్గం పరిధిలోని మన్ననూరులో బీటీ రోడ్డు పనులకు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎంపీ రాములు, టీఎస్ ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గతంలో కరెంటో కావాలంటే ఎంతో గోసపడే వాళ్లం.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ను కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్నదని పేర్కొన్నారు.
రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాల ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఏడాదికి రెండు పంటలు పండించుకునే విధంగా సాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. పండిన పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి వారి అకౌంట్లో డబ్బులు పడే విధంగా చేస్తున్నాం. ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేసి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం అని మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు.