టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనని, తన పిల్లల్ని చూసుకోవడానికి ఓ వ్యక్తి తోడుంటే బాగుంటుందని తన మనసులోమాట చెప్పిన విషయం తెలిసిందే. అయితే రేణు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పవన్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరో పెళ్లి చేసుకుంటే మీ గౌరవం తగ్గుతుందని కొందరు, మిమ్మల్ని అసహ్యించుకుంటామని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేయడంపై ఆమె ఆ మెసేజ్లను స్క్రీన్ షాట్లు తీసి తన ఫేస్బుక్ పేజ్లో చేసిన పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది.
ఈ పోస్ట్ కేవలం నన్ను మాత్రమే ఉద్దేశించింది కాదు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం. ఇలాంటి ఆలోచన తీరున్న మగవాళ్ల మధ్య ఉన్నామని ఆందోళన చెందాల్సి వస్తుంది. సమాజంలో ఓవైపు మహిళా సమానత, ఆడపిల్లల శక్తి స్వరూపం, అత్యాచారాల నుంచి మహిళలను కాపాడాలి.. వారి భద్రతకు చర్యలు తీసుకోవాలి అంటూ.. మరోవైపు ఏడేళ్లు ఒంటరిగా ఉన్న నేను ఇప్పుడు ఒకరి తోడు అవసరమని మాట్లాడితే అసహ్యించుకుంటున్నట్లు సందేశాలు పంపుతున్నారు. మన దేశంలో ఓ మగాడు ఏమైనా చేయొచ్చు.. ఎన్నిసార్లయినా పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఓ అమ్మాయి మరో బంధం గురించి గురించి ఆలోచించడం మాత్రం తప్పా.. జీవితాంతం తప్పు చేశానన్న భావనతో ఏ తోడు లేకుండా బతకాలా.. ఇవాళ నేను దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.. మన దేశంలో అమ్మాయిల భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే, ఆ మహిళలే వాళ్ల కొడుకులను చాలా పద్ధతిగా పెంచాలి. అప్పుడైనా మగవాళ్ల ఆలోచనా విధానంలో మార్పు వస్తుందేమో అంటూ రేణుదేశాయ్ తను చేసిన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.