తెలుగు రాష్టాల్లో ఇప్పుడు రాజకీయ సినీ వర్గాల్లో హట్టాపిక్ ఎన్టీఆర్ బయోపిక్. ముందుగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తామని ఆయన తనయుడు, సినీ హీరో..ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. తర్వాత వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా రంగంలోకి దిగారు. నేనే ఈ సినిమా తీస్తాను అన్నారు. అందరూ తొలుత బాలకృష్ణ సినిమాకే వర్మ దర్శకత్వం వహిస్తారని భావించారు. వర్మ కూడా ఇంచుమించు అదే తరహా ఫీలర్స్ పంపారు. కానీ తర్వాత సీన్ మారింది. బాలకృష్ణ హీరోగా నటించే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలో రాజకీయ పార్టీని పెట్టి.. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన ఘటనతో క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక మిస్టర్ వివాద్ ఫుల్ డైరెక్టర్.. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఫస్ట్ లుక్ను కూడా వదిలి మరోసారి సెన్షేషన్ క్రియేట్ చేశారు. అదేమి విచిత్రమో కానీ.. తేజ చిత్రాన్ని ఎక్కడైతే ముగించనున్నారో.. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ను అక్కడ నుంచే ప్రారంభిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించినప్పటి నుంచి.. ఆమె కోణంలో వర్మ తన సినిమా ఉంటుందని ప్రకటించారు. అంటే అందులో చంద్రబాబు వెన్నుపోటుతోపాటు ఎన్టీఆర్ ను అందరూ కలసి ఒంటరిని చేసిన అంశాలు కూడా వర్మ సినిమాలో దర్శనం ఇవ్వబోతున్నాయన్న మాట. అంటే తేజ ఆపేసిన చోట నుంచే వర్మ మొదలుపెడతారు. సో..రాబోయే రోజుల్లో ఈ సినిమా వ్యవహారం హాట్ హాట్గా మారటం ఖాయంగా కన్పిస్తోంది. ఏపీ మంత్రి సోమిరెడ్డి ఇఫ్పటికే వర్మపై విమర్శలు చేశారు. వర్మ కూడా అంతే స్పీడ్ గా కౌంటర్ ఇచ్చారు. కావాలంటే లక్ష్మీపార్వతి పక్కన ఎన్టీఆర్ రోల్ సోమిరెడ్డికే ఇస్తానంటూ వర్మ మంత్రికి ఆఫర్ ఇచ్చారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితం ఎన్ని సంచలనాలకు కారణం అయిందో.. ఇప్పుడు ఆయన సినిమా కూడా అంతే సంచనాలకు కేంద్రంగా మారుతోంది. ఈ సినిమా రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తోందో చూడాలి.